High court On Nagaram Lands Issue : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెం.181లోని భూమిని ప్రైవేటుకు అప్పగించిన తీరుపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందినవంటూ నిషేధిత జాబితాల్లో చేర్చుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంపై : నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయడాన్ని సవాలు చేస్తూ మహమ్మద్ ఫరూజ్ అలీఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి హక్కులకు సంబంధించిన వివాదాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలంటూ కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ ఫరూజ్ అలీఖాన్ దాఖలు చేసిన అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అస్సెట్ రీకనస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ ఎస్పీ వేలాయుథం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజిస్ట్రేషన్ అధికారులు విధుల నిర్వహణలో విఫలమైనపుడు జోక్యం చేసుకునే అధికారం హైకోర్టులకు ఉందన్నారు.
ఆ ఉత్తర్వులను సమర్పించండి : భూదాన్ భూములంటూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఎ కింద్ర నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన భూములను రిజిస్ట్రేషన్ చేయరాదని, అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ చేశారన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రిజిస్ట్రేషన్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించినందున పిటిషన్ విచారణార్హమేనన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది కె మురళీధర్రెడ్డికి ఆదేశించింది. ముఖ్యంగా నిషేధిత జాబితాలో చేర్చుతూ జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని ఆదేశించింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్ధనను తోసిపుచ్చింది. కౌంటర్లు దాఖలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వలేమంటూ విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
సర్వే నిర్వహించి సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేశాఖకు ఉంది : హైకోర్టు
'గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలను కూల్చేయాల్సిందే - విధుల్లో విఫలమైతే కేంద్రాన్ని రంగంలోకి దించుతాం'