Stepwells Renovation in Hyderabad : భాగ్యనగరంలోని పురాతన మెట్లబావుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. వీటి పునరుద్ధరణకు పలు పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పర్యాటకశాఖతో సీఐఐ ఒప్పందం చేసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మహాలఖా మెట్ల బావిని ఇన్ఫోసిస్, సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ పునరుద్ధరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అడిక్మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి మహిళ కళాశాల పునరుద్ధరించేందుకు ముందుకొచ్చాయి.
హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తూ వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి @revanth_anumula గారి సంకల్పానికి అడుగు ముందుకు పడింది. పలు చారిత్రక పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులు… pic.twitter.com/7v6NITYfhp
— Telangana CMO (@TelanganaCMO) September 27, 2024
తెలంగాణ దర్శినికి శ్రీకారం : రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన "తెలంగాణ దర్శిని" కార్యక్రమానికి సంబంధించిన జీవోను జారీ చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ సంస్థలలో చదివే విద్యార్థులను కేటగిరీలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను ఉచితంగా చూపిస్తారు. రవాణా, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ12.10 కోట్ల నిధులను సైతం విడుదల చేసింది.
మూసీ చారిత్రక భవనాల అభివృద్ధి : హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళతామన్నారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, మూసీ పరీవాహకంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు శుభవార్త. పర్యాటక, చారిత్రక ప్రాంతాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించే అవకాశాన్ని ముఖ్యమంత్రి @revanth_anumula గారు కల్పించారు. 'తెలంగాణ దర్శిని' పేరుతో ఈ మేరకు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు… pic.twitter.com/5XPULhxQof
— Telangana CMO (@TelanganaCMO) September 27, 2024
పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం శాసనమండలి కొనసాగుతున్న చారిత్రక ప్రాధాన్యం ఉన్న జూబ్లీహాల్ను పరిరక్షించాల్సిన అవసరముందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జూబ్లీహాల్ను దత్తత తీసుకొని పరిరక్షించాలని సీఐఐకి ముఖ్యమంత్రి సూచించారు.
ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్కు తరలించి ప్రస్తుత భవనాన్ని పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. హైకోర్టు భవనం, సిటీ కాలేజ్ భవనం, పురానాపూల్ బ్రిడ్జి వంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికే చార్మినార్ పరిరక్షణ ప్రాజెక్ట్ కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.