CM Revanth Reddy Meeting with Governor Radhakrishnan : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్తో 2 గంటల పాటు భేటీ అయ్యారు. గవర్నర్తో లంచ్కు భేటీ అయిన సీఎం, రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మంత్రి మండలి విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం, పలు బిల్లులకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12.45 గంటలకు రాజ్భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, 2.55 గంటల వరకు గవర్నర్తో చర్చించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల దగ్గర నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఐదు రోజుల పాటు దిల్లీలో మకాం వేసిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి మండలి విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దిల్లీ నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో సమావేశం కావడం, అది కూడా 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.
అధిష్ఠానంతో సీఎం రేవంత్ కీలక భేటీ - కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చ - TG congress meet in delhi
మంత్రివర్గ విస్తరణపైనే ప్రధాన చర్చ! : ఈ నెల 7 తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో అంతకు ముందే ప్రమాణ స్వీకారం చేయాలన్న భావనతో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించి ఉంటే గవర్నర్ వద్ద ఇదే అంశం చర్చించి ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్ చట్టంతో పాటు భూ చట్టాలను అన్నింటినీ ఏకం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు తీసుకొస్తున్న బిల్లుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.