Center Key Decision On Telangana Ap Cadre : తెలంగాణ, ఏపీ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చింది. ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్లు అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి తదితరులు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
ఐఏఎస్, ఐపీఎస్ల అభ్యర్థనను తోసిపుచ్చిన కేంద్రం : ఆ ఐఏఎస్, ఐపీఎస్ల అభ్యర్థనను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం వారందర్నీ తెలంగాణ నుంచి ఏపీ రాష్ట్రానికి వెళ్లాలని తాజాగా ఆదేశించింది. వారిని తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ(కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ) ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16లోగా ఆంధ్రప్రదేశ్లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, అనంత్ రాము, లోతేటి శివశంకర్, సృజనలను సైతం రిలీవ్ చేస్తూ ఈ మేరకు డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ వివాదం : ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అధికారులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే వారిలో కొందరు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపిస్తూ తమను తెలంగాణ కేడర్కు మార్చాలని కేంద్రాన్ని కోరారు. ఇదే విషయంపై వారు గతంలో క్యాట్ను కూడా ఆశ్రయించారు. ఆ అధికారుల అభ్యర్థనను అంగీకరించిన క్యాట్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
గత మార్చిలో దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు అభ్యర్థనలను మరోసారి పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశం ప్రకారం అభ్యంతరాల పరిశీలన కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ను నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక మేరకు అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని ఐఏఎస్, ఐపీఎస్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం