CBSE Single Girl Child Scholarship : మీరు పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? అయితే సీబీఎస్ఈ ప్రకటించిన ఈ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ మీ కోసమే. తల్లిదండ్రులకు ఏకైక సంతానమై ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు సీబీఎస్ఈ స్కాలర్షిప్ను ఇస్తుంది. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 23 చివరి తేదీ కాగా, తాజాగా ఆ గడువును పొడిగించింది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులు 2025 జనవరి 10 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే.
సీబీఎస్ఈ స్కాలర్షిప్ వివరాలు
- తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా సీబీఎస్ఈ స్కాలర్షిప్ను అమలు చేస్తున్నారు. దీంతో ఆడపిల్లలకు ఆసరాగా ఉంటుంది.
- ఈ స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ.1000 చొప్పున సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తారు. రెండు సంవత్సరాల పాటు ఈ స్కాలర్షిప్ను అందజేస్తారు. విద్యార్థినికి చెందిన ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు.
- దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్ఈలో పదో తరగతి పాసై ఉండాలి. అలాగే ప్రస్తుతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుతూ ఉండాలి.
- పదో తరగతి పరీక్షల్లో కనీసం 70 శాతం, ఆపైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్షిప్నకు అర్హులు.
- విద్యార్థిని ట్యూషన్ ఫీజు పదో తరగతిలో నెలకు రూ.2500, సీబీఎస్ఈ 11, 12 తరగతులకు రూ.3 వేలు మించకుండా ఉండాలి.
- సీబీఎస్ఈ బోర్డులో విద్యనభ్యసిస్తున్న ఎన్నారై విద్యార్థినులూ ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6 వేలు మించి ఉండొద్దు.
- ఈ స్కాలర్షిప్నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి.
- 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ కోసం ఆ విద్యార్థినులు కనీసం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
- తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉండాలి.
- 2025 జనవరి 10వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
- ఈ దరఖాస్తులను సంబంధిత పాఠశాలలు జనవరి 17 వరకు వెరిఫికేషన్ను పూర్తి చేసుకోవాలి.
- దరఖాస్తు కోసం ఈ లింక్ పై ఇక్కడ క్లిక్ చేయండి.
ఎన్ఎంఎస్ పరీక్షలో ప్రతిభ చూపండి - రూ.12 వేల ఉపకారవేతనం సొంతం చేసుకోండి