Harish Rao Comments On Minister Seethakka : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారిందని తాము చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతుందని ఆక్షేపించారు. తాము పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారని అసలు ఏది అబద్ధం అని ప్రశ్నించారు. ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నా గ్రామ పంచాయతీలకు ఇప్పటికి 9 పైసలు కూడా చెల్లించలేదనేది అబద్ధమా? అని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం : కేంద్రం నుంచి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ. 2100 కోట్ల రూపాయలు నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్లించింది అబద్ధమా అని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 500 కోట్ల రూపాయలు నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్ధమా అని ప్రశ్నించారు. మాజీ గ్రామ సర్పంచులు పెండింగ్ బిల్లుల కోసం చలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం అటకెక్కిందని చెప్పడం తాము అబద్ధం చెప్పడమా అని మంత్రి సీతక్కపై ధ్వజమెత్తారు.
"గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ రోగాలు వస్తున్నాయి. రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించడం లేదు. 8 నెలలుగా జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వడంలేదు. బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెలనెల రూ. 275 కోట్లు, సంవత్సరానికి రూ. 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించకుండా సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదు. ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలి." - హరీశ్ రావు, మాజీ మంత్రి
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించటంలో ప్రభుత్వం విఫలం : హరీశ్ రావు