Andhra Pradesh Government Introduce Vote-on-Account Budget : 'రాబడి పెరిగినా సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడమే చాలా కష్టంగా ఉంది' అని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) మంగళవారం శాసనసభలో చెప్పిన వేళ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్లో నిధులు అంతంత మాత్రమేనా అన్న చర్చ సాగుతోంది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన ఎన్నో హామీలు తన ఐదేళ్ల పాలనాకాలంలో జగన్ నెరవేర్చలేకపోయారు. జలయజ్ఞం (Jalayagnam) అనేది అసలు ముందుకు సాగలేదు. అభివృద్ధి కార్యక్రమాల ఊసే వినిపించలేదు. రెవెన్యూ రాబడులు లెక్కకు మిక్కిలి అంచనావేస్తూ రూపొందించిన బడ్జెట్లూ అంతంతమాత్రంగానే అమలయ్యాయి. ఆర్థికంగా అనేక సవాళ్లు జగన్ సర్కార్ ఎదుర్కొంటున్నందున ఈ బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులు పెద్దగా పెరిగే అవకాశం లేదని సమాచారం.
జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా పెద్ద మొత్తంలో రాబడులు ఆశించి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పిస్తున్నా ఆ స్థాయిలో రాబడి ఉండటం లేదు. అప్పులు మాత్రం అంచనాలకు మించి ఉంటున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో లక్షా 78 వేల 697.41 కోట్ల రెవెన్యూ రాబడులు ఆశించగా లక్షా11 వేల 34.02 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగింది. ఆశించిన రాబడి లక్షా 61 వేల 958.50 కోట్లు కాగా వాస్తవ రాబడి లక్షా17 వేల136.18 కోట్లే. 2021-22లో లక్షా77 వేల 196.48 కోట్లు ఆశిస్తే లక్షా50 వేల 552.49 కోట్లే దక్కింది. 2022-23లో లక్షా 91 వేళ 225.11 కోట్లు రాబడి అంచనాగా ఉంది. అంచనాలు సవరించే నాటికి లక్షా 76 వేల 448 కోట్లే వచ్చింది.
ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - దాదాపు రూ.3 లక్షల కోట్లకు మించి సమర్పణ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 6 వేల 224 కోట్ల రాబడి ఆశిస్తే తొలి 10 నెలల్లో జనవరి నెలాఖరు వరకు వచ్చిన మొత్తం లక్షా 19 వేల 125 కోట్లే. ఇప్పటికే కాగ్ (CAG) వరుసగా ఆర్థికశాఖకు తలంటుతూ వస్తోంది. బడ్జెట్ అంచనాలకు, అదనపు ఆమోదాలకు, వాస్తవ ఖర్చులకు పొంతనే లేదని తన నివేదికల్లో ప్రస్తావిస్తోంది. ఈ విమర్శల నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎంత వాస్తవ దృక్పథంతో ఉంటుందనేది చర్చనీయాంశమవుతోంది.
అన్ని ప్రభుత్వశాఖలు 3.20 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ ఖర్చు ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. కేంద్రసాయంతో అమలు చేసే పథకాలకు రాష్ట్రం తన వాటా నిధులు సరిగా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న పథకాలకే బడ్జెట్లో కేటాయింపులు చూపనున్నారు.