Rohit Sharma Yashasvi Jaiswal Ranji : జమ్ముకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన భారత స్టార్ ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులకే పెవిలియన్ చేరిన రోహిత్, ఈ ఇన్నింగ్స్లో నిలదొక్కుకున్నాడనుకునేలోపే 28 పరుగుల వద్ద ఔటయ్యాడు.
మరోవైపు జైస్వాల్ కూడా 26 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో భారీ అంచనలాతో దిగిన ఈ జోడీ మరోసారి నిరాశపర్చింది. అయితే ఈ మ్యాచ్లో విఫలమైనా, రోహిత్ - జైస్వాల్ జోడీ ఓ అద్భుత రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అదేంటంటే?
ఏకైక జోడీ
ప్రస్తుతం అంతర్జాతీయ టెస్టుల్లో టీమ్ఇండియా నుంచి రోహిత్ శర్మ- జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. తాజాగా ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు రంజీలోనూ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఒకే రంజీ జట్టు తరపున ఓపెనర్లుగా బరిలోకి దిగిన భారత తొలి టెస్టు ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించారు.
రోహిత్ 17ఏళ్ల తర్వాత
అలాగే, రోహిత్ శర్మ 17ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడిన భారత తొలి కెప్టెన్గానూ నిలిచాడు. అలా చివరగా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే తాను కెప్టెన్గా ఉన్నప్పుడు ఆడాడు. 2008లో తాను భారత్ జట్టుకు కెప్టెన్గా ఉన్న అనిల్ కుంబ్లే మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు.