Indian Captains Beat Australia ICC Finals: క్రికెట్లో ఆస్ట్రేలియా అత్యంత బలమైన జట్టు. రెండేళ్లుగా క్రికెట్లో పూర్తిగా ఆసీస్ డామినేషన్ నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహిళలు 2022లో వన్డే, 2023లో టీ20 వరల్డ్కప్ టైటిళ్లు సొంతం చేసుకోగా, 2023లో డబ్ల్యూటీసీ, వన్డే ప్రపంచకప్ పురుషుల జట్టు దక్కించుకుంది. ఇక తాజాగా అండర్- 19 వరల్డ్కప్లోనూ కుర్రాళ్లు ఆధిపత్యం ప్రదర్శించి కప్పును ముద్దాడారు.
ఇలా గత రెండేళ్లలో ఆసీస్ ఐదు ఐసీసీ టైటిళ్లు సాధిస్తే, అందులో మూడుసార్లు ఫైనల్ ఫైట్లో భారత్నే ఓడించింది. అయితే క్రికెట్లో భారత్ తక్కువేమీ కాదు. పటిష్ఠమైన జట్లలో టీమ్ఇండియా ఒకటి. ఇప్పటివరకూ ఎందరో అత్యుత్తమ ఆటగాళ్లు పలు ఐసీసీ టోర్నీల్లో టీమ్ఇండియాకు సారధ్యం వహించారు. అయితే మెగా ఈవెంట్ ఫైనల్స్లో మాత్రం ఆస్ట్రేలియాను ఒడించిన భారత కెప్టెన్లు ఇద్దరే ఇద్దరు.
2012 అండర్- 19 టోర్నీలో ఉన్ముక్త్ చంద్ భారత్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా తుదిపోరుకు అర్హత సాధించాయి. ఇక ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 47.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ సెంచరీ (111*) తో మెరిశాడు. ఈ విజయంతో ఐసీసీ ఈవెంట్లలో ఆసీస్ను ఫైనల్లో ఓడించిన తొలి కెప్టెన్గా ఉన్ముక్త్ నిలిచాడు.
రెండోసారి కూడా ఆసీస్ను ఫైనల్స్లో భారత్ ఓడించింది అండర్- 19 వరల్డ్కప్లోనే. 2018 టోర్నమెంట్లో పృథ్వీ షా టీమ్ఇండియాకు నాయకత్వం వహించాడు. పృథ్వీ నేతృత్వంలో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. తుదిపోరులో ఆసీస్ను ఢీకొట్టిన టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 217 పరుగులు టార్గెట్ను టీమ్ఇండియా 38.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ మన్జోత్ కల్రా (101*) శతకంతో మెరిశాడు. దీంతో ఆసీస్ను ఫైనల్స్లో దెబ్బకొట్టిన రెండో భారత కెప్టెన్గా పృథ్వీ తన పేరును లిఖించుకున్నాడు. వీరిద్దరే ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్లో ఆసీస్ను ఓడించగలిగారు.
టీమ్ఇండియాకు నిరాశ - నాలుగోసారి అండర్ 19 కప్ ఆసీస్ సొంతం
'నేనైతే అలా అనుకోవట్లేదు'- U 19 భారత్ కెప్టెన్ ఉదయ్ ఇంట్రెస్టింగ్ రిప్లై