Washington Sundar Gambhir Plan : న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టులో టీమ్ ఇండియాకు పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. బెంగళూరు పిచ్ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు. వర్షం కారణంగా పిచ్ మొదట పేస్కు అనుకూలంగా మారింది. కానీ, దానిని టీమ్ ఇండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకోలేదు. బ్యాటింగ్ ఎంచుకుని తడబాటుకు గురైంది. ఫలితంగా ఓటమిని అందుకుంది.
దీంతో ఇప్పుడు భారత జట్టు మిగతా రెండు టెస్టుల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇందుకోసం జట్టులోకి అదనంగా స్పిన్ ఆల్ రౌండర్ను తెచ్చుకుంది. అదీ కూడా దాదాపు మూడేళ్ల క్రితం చివరి సారిగా టెస్టు ఆడిన వాషింగ్టన్ సుందర్ను తీసుకుంది.
రెండు కారణాలు - మొదటి మ్యాచ్కు 15 మందితో కూడిన స్క్వాడ్ను తీసుకుంది బీసీసీఐ. కానీ ఆఖరి రెండు టెస్టులకు మాత్రం 16 మందిని సెలెక్ట్ చేసింది. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి. అందులో ఒకటి ఇద్దరు బ్యాటర్లకు గాయాలు ఆందోళన పెడుతుండటం. మరొకటి గౌతమ్ గంభీర్ ప్లాన్ కోసం 16 మందిని తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
సుందర్ స్పెషల్ స్పిన్నర్ - ప్రస్తుతం ఉన్న జట్టులో ఇప్పటికే నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అందులో ముగ్గురు బ్యాటింగ్ చేయగలిగే ఆల్రౌండర్లు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్రౌండర్లు, కుల్దీప్ యాదవ్ మాత్రం స్పెషలిస్ట్ స్పిన్నర్. ఇప్పుడీ లిస్ట్లోకి మరొక స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ చేరిపోయాడు. పైగా జడేజా, అక్షర్ ఎడమచేతివాటం కలిగిన బౌలర్ కమ్ బ్యాటర్లు. కానీ, సుందర్ మాత్రం ఎడమచేతివాటం బ్యాటర్, కుడిచేతి బౌలర్. ఫింగర్ స్పిన్ వేయగల సమర్థుడు కూడా. మునివేళ్లతోనే బంతిని సంధించగలడు.
గంభీర్ ప్లాన్ ఇదే - వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు కేవలం 4 టెస్టుల్లో మాత్రమే బరిలోకి దిగాడు. గబ్బా మైదానం వేదికగా ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో ఒక్క మ్యాచ్ ఆడిన అతడు ఏకంగా నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పేస్కు అనుకూలంగా ఉండే ఆ పిచ్పై బంతులను చక్కగా సంధించాడు. తాజాగా రంజీ ట్రోఫీలో వన్డౌన్లోనూ బ్యాటింగ్కు వచ్చిన సుందర్, భారీ సెంచరీ సాధించాడు. ఇది అతడికి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అందుకే గంభీర్ మేనేజ్మెంట్ను ఒప్పించి సుందర్ను జట్టులోకి తీసుకున్నాడట. ఈ విషయాన్ని క్రికెట్ వర్గాలు తెలిపాయి. నెక్ట్స్ ఆస్ట్రేలియా పర్యటనకు కూడా అతడిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
బుమ్రాకు విశ్రాంతి - న్యుజిలాండ్తో రెండో టెస్ట్ మ్యాచ్కు బుమ్రాకు రెస్ట్ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసీస్తో ఐదు టెస్టుల సిరీస్కు సమయం లేకపోవడం ఓ కారణం కావచ్చు. అయితే పుణె(న్యూజిలాండ్తో రెండో మ్యాచ్) పిచ్ను స్పిన్కు అనుకూలంగా తయారు చేయించి, కేవలం ఇద్దరు పేసర్లను మాత్రమే తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. సిరాజ్తో పాటు ఆకాశ్దీప్ తుది జట్టులో ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు సుందర్ను తీసుకోవడం వల్ల బ్యాటర్ కమ్ బౌలర్ రూపంలో అదనపు ఆప్షన్ దక్కింది.
న్యూజిలాండ్తో జరిగిన మొదటి టెస్టులో మెరుగైన ప్రదర్శన చేయని కేఎల్ రాహుల్ను పక్కన పెట్టొచ్చు. ఒకవేళ గిల్, పంత్ ఫిట్నెస్ సాధించలేకపోతేనే రాహుల్కు అవకాశం ఉంటుంది. పంత్ విషయంలో తొందరపడమని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ చెప్పాడు. కాబట్టి ఒకవేళ వీరిద్దరు జట్టులోకి వస్తేనే రాహుల్ను తప్పించి, నలుగురు స్పిన్ ఆల్రౌండర్లను మేనేజ్మెంట్ తీసుకోవచ్చు.
జడేజా, అశ్విన్, అక్షర్, సుందర్ను తుది జట్టులోకి తీసుకుంటారు. కుల్దీప్ను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ డెప్త్ ఉండాలనేది గంభీర్ ప్లాన్. కనీసం 9వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల ప్లేయర్స్ ఉంటే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఛాన్స్ ఉంటుంది.
తుది జట్టు (అంచనా) : కెప్టెన్ రోహిత్ శర్మ , యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్/వాషింగ్టన్ సుందర్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్/ధ్రువ్ జురెల్/కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్/ కుల్దీప్ యాదవ్, సిరాజ్, ఆకాశ్ దీప్
పంత్ రెండో టెస్ట్ ఆడుతాడా? - అతడి గాయంపై మాట్లాడిన రోహిత్!
కివీస్ టెస్టు సిరీస్: BCCI కీలక నిర్ణయం- యంగ్ ఆల్రౌండర్కు జట్టులో చోటు