Adi yogi statue Tour in Coimbatore : మహాశివుడి రూపమే అత్యద్భుతంగా ఉంటుంది. దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనవుతారు. అలాంటిది, పరమ పవిత్రమైన శివరాత్రివేళ అత్యంత అపురూపమైన "ఆదియోగి" విగ్రహాన్ని దర్శించుకుంటే ఆ క్షణాలు జీవితాంతం కళ్ల ముందు కదలాడుతాయి. అందుకే, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ శివరాత్రికి ప్లాన్ చేయండి. ఎలా వెళ్లాలో మేం దారి చూపిస్తాం.
ఈ మహా ఆదియోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంది. ఎత్తు ఏకంగా 112 అడుగులు. రూపం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మహాశివుడి విగ్రహాన్ని వారంలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. రాత్రివేళ ఈ విగ్రహం మీద ప్రసరించే లైటింగ్ షో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి డబ్బులూ చెల్లించాల్సిన అవసరం లేదు.
శివరాత్రి కోలాహలం :
మహాశివరాత్రి వేళ శివయ్య సమక్షంలో జాగారం చేస్తేనే భక్తులకు సంతృప్తి. అందుకే ఈ పర్వదినం వేళ ఆదియోగి విగ్రహ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. సామాన్య భక్తుల నుంచి ప్రముఖుల వరకు అక్కడ బారులు తీరుతారు. రాత్రంతా శివనామ స్మరణలో తేలియాడుతారు.
సందర్శించదగిన ఇతర ప్రదేశాలు :
ఆదియోగి విగ్రహం మాత్రమే కాకుండా, సమీపంలో మరికొన్ని దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి ధ్యానలింగ ఆలయం. కోయంబత్తూరులోని ఈ టెంపుల్లో పొడవైన శివలింగం ఉంటుంది. ఆదియోగి విగ్రహాన్ని దర్శించుకునేవారు తప్పకుండా ధ్యానలింగాన్ని సందర్శిస్తారు.
సూర్య కుండ్, చంద్ర కుండ్ :
సమీపంలో సూర్యకుండ్ ఇంకా చంద్రకుండ్ ఉన్నాయి. ఆదియోగి విగ్రహాన్ని సందర్శించుకోవడానికి ముందే భక్తులు ఇక్కడకు వెళ్లి స్నానాలు చేస్తారు. ఈ కుండ్లు ఎంతో నీట్గా ఉంటాయి. చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటాయి.
వెల్లియంగిరి పర్వతాలు :
టూరిస్ట్ ప్లేస్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ట్రెక్కింగ్ చేయాలని కోరుకునేవారికి వెల్లియంగిరి పర్వతాలు సూపర్ ఆప్షన్. ఈ కొండలపై నుండి కనిపించే దృశ్యాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ప్రకృతిని ఇష్టపడే వారు తప్పకుండా వెళ్లి వస్తారు.
వైదేహి జలపాతం :
జలపాతాలను చూడాలనే వారి కోరిక కూడా తీరుతుంది. వైదేహి జలపాతం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా ట్రెక్కింగ్ ఉంటుంది. ఇది కూడా మెమరబుల్ ప్లేస్గా మిగిలిపోతుంది.
ఆదియోగి చెంతకు ఇలా :
- తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లాలనుకునే భక్తులు రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
- రైలు ద్వారా వెళ్లాలనుకునేవారు ముందుగా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఆదియోగి విగ్రహం సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
- కోయంబత్తూరులోని గాంధీపురం బస్ స్టేషన్ నుంచి ఆదియోగి విగ్రహం వద్దకు ప్రతి గంటకూ ఒక బస్సు వెళ్తుంది. అక్కడ దిగి మరో ఐదారు నిమిషాల జర్నీ చేయాల్సి ఉంటుంది.
- వ్యక్తిగత వాహనం ద్వారా కూడా నేరుగా ఆదియోగి వద్దకు చేరుకోవచ్చు.
- ఫ్లైట్లో వెళ్లాలని అనుకునేవారు, కోయంబత్తూర్ విమానాశ్రయం చేరుకోవాలి. అక్కడి నుంచి 33 కిలోమీటర్ల దూరంలో విగ్రహం ఉంటుంది. ఇక్కడ్నుంచి పలు రకాల రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే నీరసం అస్సలే రాదు!