Sabudana Dosa Recipe in Telugu : చాలా మంది బ్రేక్ఫాస్ట్లో దోశ ఇష్టంగా తింటారు. అందుకే ఎక్కువమంది మహిళలు వారానికి సరిపడా దోశ పిండి ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టుకుంటుంటారు. అయితే, దోశలు ఎప్పుడూ బియ్యం, మినప్పప్పు మిశ్రమంతోనే కాకుండా ఓ సారి సగ్గుబియ్యంతో ట్రై చేయండి. ఈ దోశలు మృదువుగా ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పైగా ఈ సగ్గుబియ్యం దోశలు చేయడానికి పిండిని రాత్రంతా పులియబెట్టాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు చేసుకోవచ్చు! మరి ఇక ఆలస్యం చేయకుండా సూపర్ సాఫ్ట్ సగ్గుబియ్యం దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- సగ్గుబియ్యం - 1 కప్పు
- బియ్యం - 1 కప్పు
- పెరుగు - పావు కప్పు
- నూనె - తగినంత
- అల్లం - అంగుళం ముక్క
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పచ్చిమిర్చి - 4
- ఉల్లిపాయ - 1
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - 2 రెమ్మలు(సన్నగా తరుక్కోవాలి)
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా వేర్వేరు గిన్నెలలో బియ్యం, సగ్గుబియ్యాన్ని విడివిడిగా మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి.
- అలాగే దోశల పిండిలో కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో సగ్గుబియ్యం వేసుకుని కొన్ని నీళ్లు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఆపై బియ్యం కూడా మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అనంతరం పిండిని మిక్సింగ్ బౌల్లో కలుపుకోండి.
- అనంతరం మరో మిక్సీ జార్లో సన్నగా తరుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న పిండిలోకి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు అందులో పెరుగు, సన్నగా తరుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- పిండి మరీ పలుచగా, చిక్కగా కాకుండా దోశల పిండిలా ఉండే విధంగా పిండిలో నీళ్లు పోసి కలుపుకోండి.
- ఇప్పుడు స్టవ్పై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి, పిండిని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
- ఇక్కడ ఈ పిండిని నార్మల్ దోశ వేసుకున్నట్లు గట్టిగా రుద్దకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి కాస్త మందంగానే వస్తాయి.
- దోశ కొద్దిగా కాలాక అంచుల వెంబడి కాస్త నూనె వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని దోశలను సర్వ్ చేసుకోవాలి.
- మిగిలిన పిండితో ఇలా సగ్గుబియ్యం దోశలు చేసుకుంటే టేస్టీగా ఉండే "సగ్గుబియ్యం దోశలు" రెడీ!
- ఈ దోశలు అల్లం చట్నీతో ఎంతో బాగుంటాయి.
- సగ్గుబియ్యం దోశలు నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
ఇడ్లీ పాత్రలో "వడలు" - చుక్క నూనె అవసరం లేదు - టేస్ట్ అదుర్స్!
'ఆహా!' అనిపించే కమ్మటి "రాగి ఉప్మా" - ఒక్కసారి తింటే మళ్లీ చేసుకోవడం పక్కా!