ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా రీరిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులు అంతగా ఆదరించని సినిమాలు కూడా, రిరిలీజ్లో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సైతం క్యూ కడుతున్నారు. ఈ రీరిలీజ్ల ట్రెండే ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు బూస్ట్ను ఇస్తోంది. అదేలాగంటే?
బాలీవుడ్లో రీరిలీజ్ల మేనియా!
బాలీవుడ్ క్రైమ్ కామెడీ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్' 2012లో విడుదలైంది. ఈ సినిమాను ప్రేక్షకులు అప్పట్లో థియేటర్లో ఆదరించలేదు. అలాగే 2018లో విడుదలైన 'లైలా మజ్ను' కూడా పరాభవం మూటకట్టుకుంది. 'రాక్స్టార్' వంటి సినిమాలు ప్రేక్షకులకు నచ్చలేదు. అయితే ఈ సినిమాలు ఇటీవల రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లను సాధించాయి. మొదటి రిలీజైనప్పుడు కలెక్షన్ల లేక డీలా పడ్డ ఈ సినిమాలు ఇప్పుడు ఈ రీరిలీజ్లో అదరగొట్టాయి.
"ఈ సినిమాలను చూడటానికి ఇష్టపడేవారు, విడుదల సమయంలో చూడలేనివారు రిరిలీజ్ సమయంలో థియేటర్లకు వస్తున్నారు. పెద్ద స్క్రీన్ మీద తమ అభిమాన హీరోని చూసుకుంటున్నారు. ఇదే హాల్స్ నిండడానికి, అలాగే ఎగ్జిబిటర్లకు డబ్బులు తెచ్చిపెడుతోంది. సినిమాపై రైట్స్ను కలిగి ఉన్నవారికి కూడా డబ్బు అందుతోంది. 'లైలా మజ్ను', 'రాక్స్టార్' వంటి సినిమాలు రిలీజ్ అప్పుడు థియేటర్లలో అంతగా ఆడలేదు. ప్రస్తుతం రీరిలీజ్ లో అదరగొట్టాయి. లైలా మజ్ను సినిమా రీరిలీజ్లో దేశం మొత్తం మీద 40శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ముంబయిలో అయితే ఏకంగా 80 శాతం ఆక్యుపెన్సీ అయ్యింది." అని ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ తాజాగా ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
రీరిలీడ్ సినిమాల ట్రెండ్
రీరిలీజ్ చిత్రాలకు సాధారణంగా మంచి స్పందన వస్తోందని, ఈ ట్రెండ్ కొనసాగుతుందని ఆశిస్తున్నామని సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ నితిన్ దాతార్ తెలిపారు. కొత్తగా విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నారని చెప్పారు. అలాంటివారికి రీరిలీజ్ సినిమాలు ఆదుకుంటాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు, రీరిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడూ భారీ లాభాలను అర్జించవని మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ ఆశిష్ కనకియా తెలిపారు. అయితే అవి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని చెప్పుకొచ్చారు. రీరిలీజ్ మూవీస్కు ఆక్యుపెన్సీ దాదాపు 30 శాతం ఉంటుందని వెల్లడించారు.
వ్యాపారంలో పెరుగుదల
మరోవైపు, సినిమాల రీరిలీజ్ల కారణంగా తమ వ్యాపారంలో స్వల్ప పెరుగుదల కనిపించిందని జయపురకు చెందిన సీనియర్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రాజ్ బన్సల్ పేర్కొన్నారు. " అయితే బాలీవుడ్కు రిరిలీజ్ల ట్రెండ్ కొత్తేమీ కాదు. 70, 80, 90వ దశకంలో 'మదర్ ఇండియా', 'మొఘల్ ఈ-ఆజం', 'షోలే', 'అంఖేన్' వంటి రిరిలీజ్ అయ్యాయి. అప్పట్లో ప్రస్తుతరోజుల కంటే కనీసం 20- 25 శాతం వ్యాపారం ఎక్కువ అయ్యేది. ఇప్పుడు మల్టీప్లెక్స్లకు పాత చిత్రాలను విడుదల చేయడం తప్ప మరో మార్గం లేదు. వ్యాపారం అంత గొప్పగా ఏమీ లేదు. అలా అని సినిమా హౌస్లు ఖాళీగా లేవు. ఎందుకంటే సిబ్బంది, విద్యుత్ ఛార్జీలు వంటి థియేటర్ యజమాన్లు భరించాల్సి ఉంటుంది. ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్కు వచ్చినప్పుడు టికెట్ ధర, పాప్కార్న్, వాహనాల పార్కింగ్ ద్వారా కొంత డబ్బు సంపాదిస్తాము." అని బన్సల్ వ్యాఖ్యానించారు.
'ప్రతి సినిమా హిట్ కాదు'
ఇటీవల కాలంలో థియేటర్లలో కొత్త సినిమాలు అప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నాయని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. అందుకే రిరిలీజ్ సినిమాలు విడుదలై లాభాలను పొందుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే రీరిలీజ్ అయిన ప్రతి సినిమా మంచి కలెక్షన్లు రాబట్టట్లేదని అన్నారు. మరోవైపు, "రాక్స్టార్ సినిమాను ఇంతకు ముందు థియేటర్లో విడుదలైనప్పుడు చూడలేకపోయాను. అందుకే రిరిలీజ్ లో పెద్ద స్క్రీన్ పై చూశాను. నాకు ఆ సినిమా పాటలు బాగా నచ్చాయి." అని ప్రేక్షకురాలు బినిత చెప్పుకొచ్చారు.
విజయ్ స్పెషల్ రికార్డు - రీరిలీజ్ ట్రెండ్లోనూ ఆ 'ఒక్కడే' ఫస్ట్ - Vijay Gilli Movie
రెండు అక్షరాల టైటిల్లో ఏడాది ప్రేమ కథ- రీరిలీజ్కు ముందు గుట్టు విప్పిన డైరెక్టర్