Postal Department GDS Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలను చేపడతారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును ఆధారంగా రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు మార్చి 3వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో 519 పోస్టులు : తెలంగాణలో 519, ఏపీలో 1,215 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ అనేది ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులను నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి పోస్టల్ డిపార్ట్మెంట్ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సైకిల్ తొక్కడం రావాలి.
ఖాళీల వివరాలు ఇవే :
- గ్రామీణ డాక్ సేవక్స్ పోస్టులు- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు
- మాస్టర్/ డాక్ సేవక్ ఉద్యోగాలు : 21,413 ఖాళీలు
సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు:
1. ఆంధ్రప్రదేశ్- 1,215 పోస్టులు
2. అస్సాం- 555 పోస్టులు
3. బిహార్- 783 పోస్టులు
4. ఛత్తీస్గఢ్- 638 పోస్టులు
5. దిల్లీ - 30 పోస్టులు
6. గుజరాత్- 1,203 పోస్టులు
7. హరియాణా- 82 పోస్టులు
8. హిమాచల్ప్రదేశ్- 331 పోస్టులు
9. జమ్మూ అండ్ కశ్మీర్- 255 పోస్టులు
10. జార్ఖండ్- 822 పోస్టులు
11. కర్ణాటక- 1,135 పోస్టులు
12. కేరళ- 1,385 పోస్టులు
13. మధ్యప్రదేశ్- 1,314 పోస్టులు
14. మహారాష్ట్ర- 1,498 పోస్టులు
15. నార్త్ ఈస్ట్రన్- 1,260 పోస్టులు
16. ఒడిశా- 1,101 పోస్టులు
17. పంజాబ్- 400 పోస్టులు
18. రాజస్థాన్- 2718 పోస్టులు
19. తమిళనాడు- 2,292 పోస్టులు
20. తెలంగాణ- 519 పోస్టులు
21. ఉత్తర్ ప్రదేశ్- 3,004 పోస్టులు
22. ఉత్తరాఖండ్- 568 పోస్టులు
23. పశ్చిమ్ బెంగాల్- 923 పోస్టులు
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 21,413.
అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్ సహా స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాలు : నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380 వేతనం ఉంటుంది
ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు10,000 రూపాయలు - రూ.24,470ల వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం : అభ్యర్థులు 10 తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలను చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలను పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
మొదటి ప్రిఫరెన్స్(ప్రాధాన్యం) ఇస్తున్నదానికి ఆప్షన్ 1 తర్వాత దానికి ఆప్షన్ 2 ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది.
దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు దివ్యాంగులు, ట్రాన్స్ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి.
బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం) : ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాల్సి ఉంటుంది. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవడం బ్రాంచ్ పోస్టు మాస్టర్ బాధ్యత. పోస్టల్కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్ను నడిపించాల్సి ఉంటుంది. తపాలా పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్(ఏబీపీఎం): ఈ కొలువులో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, తదితర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టుమాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వివిధ పథకాల గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాలి.
డాక్ సేవక్ : ఈ ఉద్యోగంలో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. బీపీఎం(బ్రాంచ్ పోస్టు మాస్టర్), ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకులకు సంబంధించిన విధులను చూసుకోవాలి. పోస్టల్ పథకాలను ప్రచారం చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం : అర్హులైన అసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిల్లకు దరఖాస్తులు చేసుకుంటే అన్ని దరఖాస్తులు రద్దు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యే తేదీ : 10.02.2025.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 03.03.2025.
- దరఖాస్తు సవరణలకు(ఎడిట్) అవకాశం : 06.03.2025 నుంచి 08.03.2025 వరకు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్పై క్లిక్ చేయండి
ఇండియన్ నావల్ అకాడమిలో ఎస్ఎస్సీ ఆఫీసర్ ఉద్యోగాలు - ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
ఆ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ - పూర్తి చేస్తే నెలకు రూ.70 వేలతో సెంట్రల్ బ్యాంక్లో కొలువు!