India To Be Third Largest Economy By 2027 : భారతదేశం ఆర్థికంగా అంచనాలకు మించి అభివృద్ధి చెందుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ వృద్ధి వేగానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని ఆమె అన్నారు. 2027 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆమె అంచనా వేశారు.
"భారతదేశం, గత ఆర్థిక సంవత్సరంలో అంచనాల కంటే మెరుగైన వృద్ధి రేటును నమోదు చేసింది. దానిని కొనసాగించేందుకు తీసుకొనే చర్యలు ఈ ఏడాది మా అంచనాలను ప్రభావితం చేస్తాయి. దీంతోపాటు ఇండియాలో ప్రైవేటు వ్యయాలు కూడా బాగా పుంజుకొన్నట్లు మేము గమనించాం" అని గీతా గోపీనాథ్ వెల్లడించారు.
"గతేడాది ప్రైవేటు వ్యయాల వృద్ధి 4 శాతం మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాలు మరింతగా పెరిగే కొద్దీ ఇది కూడా వృద్ధి చెందుతుంది. ద్విచక్ర వాహనాల విక్రయాలు, ఎఫ్ఎంసీజీ విక్రయాలు బాగా పుంజుకున్నాయి. దీనికి వర్షాలు కూడా తోడవటంతో, మంచి పంట ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా వ్యవసాయ ఆదాయం పెరిగి, గ్రామీణ వినిమయం పుంజుకుంటుంది. మా అంచనాలకు ఇవే మూలాలు" అని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ వెల్లడించారు.
వృద్ధి అంచనాలు పెంపు!
భారత్లో ఎఫ్ఎంసీజీ, ద్విచక్ర వాహన విక్రయాలు, అనుకూలమైన వర్షాల డేటా ఆధారంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐఎంఎఫ్ భారత వృద్ధిరేటు అంచనాలను 7 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఆర్థిక సర్వేలో భారత ప్రభుత్వం ఇచ్చిన 6.5 శాతం వృద్ధికంటే ఇది అధికం కావడం గమనార్హం.
Indian Economy By 2025 : భారతదేశం 2025 నాటికి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇండియా జీ20 షెర్పా, నీతిఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ ఇంతకు ముందు అభిప్రాయపడ్డారు. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, గత మూడు త్రైమాసికాల్లో వరుసగా 8 శాతం జీడీపీ వృద్ధి వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేశాయని అమితాబ్ కాంత్ అన్నారు. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2022లో యూకేను వెనక్కినెట్టి ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది భారత్.
'2024లో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.5%' - ప్రపంచ బ్యాంక్ అంచనా - Indian Economy Growth Rate 2024
భారత వృద్ధిరేటు 7.2 శాతానికి పెంపు - అంచనాలను సవరించిన ఫిచ్