Cinema Stars In Indian Stock Market : సినిమా, క్రికెట్ స్టార్లను మనం టీవీలో చూసి ఆనందిస్తూ ఉంటాం. వాళ్లు కేవలం సినిమాలకు, ఆటలకు మాత్రమే పరిమితం అవుతారని అనుకుంటాం. కానీ వాళ్లు సినిమాలు, క్రికెట్లో మాత్రమే కాదు, స్టాక్ మార్కెట్లోనూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. వారిలో ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, శిల్పా శెట్టి, కత్రినా కైఫ్, అజయ్ దేవ్గణ్, అమీర్ఖాన్, రణ్బీర్ కపూర్ తదితరులు ఉన్నారు.
ఐపీఓ భూమ్
భారతదేశంలో కొవిడ్-19 తరువాత స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. ముఖ్యంగా 2020 తరువాత నుంచి మన దేశంలో 'ఐపీఓ మార్కెట్' భూమ్ మొదలైంది. ఐపీఓలో బిడ్డింగ్ వేసి, షేర్లు పొందిన వారిలో మెజారిటీ ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. వీరిలో సినీ, క్రికెట్ స్టార్లు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఎవరెవరు ఏయే ఐపీఓ/ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ : ప్రముఖ బాలీవుడ్ హీరోలు అమీర్ఖాన్, రణబీర్ కపూర్లు డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెట్టి, లిస్టింగ్లో భారీ లాభాలను సంపాదించారు.
వాస్తవానికి అమీర్ఖాన్ ప్రీ-ఐపీఓ రౌండ్లో 46,000 షేర్లు (0.26 శాతం వాటా)ను రూ.25 లక్షలకు కొనుగోలు చేశారు. రణబీర్ కపూర్ 37,200 షేర్లు (0.21 శాతం వాటా)ను రూ.20 లక్షలకు తీసుకున్నారు. అంటే ప్రీ-ఐపీఓలో వీరికి ఒక్కో షేరు దాదాపుగా రూ.53.59లకు వచ్చింది.
డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్ 2022 డిసెంబర్ 23న స్టాక్ మార్కెట్లో రూ.102 ఓపెనింగ్ ప్రైజ్తో లిస్ట్ అయ్యింది. 2024 మార్చి 7వ తేదీన ఈ స్టాక్ రూ.155.85 ధర వద్ద క్లోజ్ అయ్యింది. అంటే ఈ స్టాక్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసినవారికి 45.52 శాతం మేర లాభాలను అందించింది. ఈ లెక్కన అమీర్ఖాన్ రూ.72.62 లక్షలు, రణబీర్ కపూర్ రూ.57.97 లక్షలు సంపాదించారు. అంటే వారు ఇన్వెస్ట్ చేసిన దానికి (సుమారుగా) మూడు రెట్లు లాభాలు ఆర్జించారు.
2. ఆజాద్ ఇంజినీరింగ్ : భారతీయులు ప్రేమగా క్రికెట్ దేవుడు, క్రికెట్ మాస్ట్రో అని పిలుచుకునే సచిన్ తెందూల్కర్ కూడా స్టాక్ మార్కెట్లో తన సత్తా చాటారు. ఆజాద్ ఇంజినీరింగ్ ప్రీ-ఐపీఓలో 4,38,120 షేర్లను రూ.114.10 యావరేజ్ ప్రైజ్తో ఆయన కొనుగోలు చేశారు. అంటే ఆయన 2023 మార్చిలో ఆజాద్ ఇంజినీరింగ్ ప్రీ-ఐపీఓలో రూ.4.99 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
ఆజాద్ ఇంజినీరింగ్ షేర్లు 2023 డిసెంబర్ 28న రూ.720 ఓపెనింగ్ ప్రైజ్తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఈ 2024 మార్చి 7 నాటికి ఈ షేర్ ధర రూ.1355.30 వద్ద క్లోజ్ అయ్యింది. దీని ప్రకారం, సచిన్ తెండూల్కర్ ప్రస్తుతం రూ.59.39 కోట్లు సంపాదించినట్లు లెక్క. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన దానికంటే 12 రెట్లు అధికంగా లాభం పొందారు.
3. నైకా : బాలీవుడ్ భామలు ఆలియా భట్, కైత్రినా కైఫ్ కూడా స్టాక్ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆసియా భట్ 2020 జులైలో రూ.4.95 కోట్లు పెట్టి నైకా షేర్లను కొనుగోలు చేసింది. అయితే ఫల్గుణి నాయర్ నేతృత్వంలోని ఈ కంపెనీ 2021 నవంబర్ 10న రూ.2,129 ఓపెనింగ్ ప్రైజ్తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. తరువాత 2022 అక్టోబర్లో కంపెనీ 1:5 బోనస్ షేర్లను అనౌన్స్ చేసింది. 2024 మార్చి 7న నైకా షేర్ రూ.156.5 వద్ద స్థిరపడింది. ఈ విధంగా షార్ట్ టర్మ్లోనే ఆలియాభట్ సంపద 11 రెట్లు పెరిగింది. అంటే రూ.4.95 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, ఆలియా భట్కు రూ.54 కోట్లు వచ్చాయి.
కత్రినా కైఫ్ 2018లో నైకా జాయింట్ వెంచర్ అయిన కేకే బ్యూటీలో రూ.2.04 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 2021 నంబర్ 10న నైకా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వెంటనే, ఆమెకు 11 రెట్లు లాభం వచ్చింది. అంటే రూ.2.04 కోట్లు పెట్టుబడి పెడితే, రూ.22 కోట్లు లాభం వచ్చింది.
4. మామాఎర్త్ : బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఒక్కో షేరుకు రూ.41.86 చొప్పున చెల్లించి 16 లక్షల మామాఎర్త్ షేర్లను కొనుగోలు చేసింది. వీటిలో 13.96 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో అమ్మేసింది. దీని వల్ల శిల్పాశెట్టికి ఏకంగా రూ.45.14 కోట్ల మేర లాభం వచ్చింది. పైగా ఇప్పటికీ మామాఎర్త్ కంపెనీలో ఆమెకు 2.3 లక్షల షేర్లు ఉన్నాయి.
5. పనోరమ స్టూడియోస్ ఇంటర్నేషనల్ : బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ పనోరమ స్టూడియోస్లో ఇన్వెస్ట్ చేసి భారీ లాభాలను ఆర్జించారు. ఆయన ప్రిఫరెన్సియల్ ఇష్యూలో (ప్రీ-ఐపీఓ కాదు) ఒక్కో షేరుకు రూ.274 చొప్పున చెల్లించి, ఒక లక్ష షేర్లు కొన్నారు. అంటే ఆయన రూ.2.74 కోట్లను ఈ షేర్లలో మదుపు చేశారు. ఇది ఒక వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. 2024 మార్చి 7న ఈ స్టాక్ రూ.995 వద్ద క్లోజ్ అయ్యింది. దీనితో అజయ్ దేవ్గణ్ ఇన్వెస్ట్మెంట్ రూ.9.95 కోట్లకు పెరిగింది. అంటే ఆయన ఏకంగా 363.13 శాతం మేర లాభాలను గడించారు.
మహిళగా మీరు ఆర్థిక స్వేచ్ఛ సాధించాలా? ఈ బెస్ట్ టిప్స్ మీ కోసమే!
రూ.కోటి ఉద్యోగం వదులుకుని 500మిలియన్ డాలర్ల బిజినెస్- ఎంతో మంది మహిళలకు ఉపాధి- ఎవరీ వినీతాసింగ్?