Woman Sang Bhajan In Operation Theatre : మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో తొలిసారి ఓ నవజాత శిశువు తన నాన్నమ్మ పాడుతున్న శివ భజనలు వింటూ తల్లి గర్భం నుంచి బయటికొచ్చాడు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. శివ భజనలతో ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అసలేం జరిగిందంటే?
ఉజ్జయినిలోని మంఛామన్ కాలనీకు చెందిన ఉపాసనా దీక్షిత్కు మార్చి 27వ తేదీన ప్రసవ నొప్పులు వచ్చాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె పరిస్థితి విషమంచింది. వెంటనే ఆమె అత్త ప్రీతి దీక్షిత్ కోడలను జేకే ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఉపాసనను ఆపరేషన్ థియేటర్కు తరలించి శస్త్రచికిత్సకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సమయంలో గర్భిణీ చాలా భయపడింది.

తన అత్తయ్యను ఆపరేషన్ థియేటర్లోకి అనుమతించమని వైద్యులను కోరింది. లోపలకు వచ్చిన అత్త ప్రీతిని శివ భజనలు చేయమని చెప్పింది. అందుకు వైద్యులు కూడా ఒప్పుకున్నారు. దీంతో ప్రీతి శివ భజనలు పాడడం మొదలుపెట్టింది. 20 నిమిషాల్లో ఉపాసన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అయితే ప్రీత భజనలు చేస్తున్న వీడియోను వైద్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
"27వ తేదీ ఉదయం ప్రసవ నొప్పులతో ఉపాసన ఆస్పత్రికి వచ్చింది. అయితే 11 గంటల ప్రాంతంలో ఆపరేషన్ చేయాలని ఆమె అత్త కోరింది. ఉపాసన కోరిక మేరకు వాళ్ల అత్త ప్రీతిని ఆపరేషన్ థియేటర్లోకి అనుమతించాం. ప్రీతి తన శివ భజనలతో సానుకూల శక్తిని సృష్టించింది. భజనలు విని మేము రిలాక్స్ అవుతూ ఆపరేషన్ చేశాం. కొందరు వైద్యులు కూడా భజన చేశారు. శివ భజన వింటూ ఉపాసన బిడ్డ జన్మించాడు" అని వైద్యురాలు జయ మిశ్రా చెప్పారు.

"7 సంవత్సరాల క్రితం నా చిన్న కొడుకు సౌరభ్ దీక్షిత్ మార్చి 27వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకే అదే రోజు డెలివరీ చేయాలని వైద్యులను చెప్పాం. కోడలికి నొప్పులు కూడా అదే రోజు వచ్చాయి. ఏడేళ్ల తర్వాత నా కొడుకు మనవడి రూపంలో పుట్టాడు" అని ప్రీతీ దీక్షిత్ తెలిపారు.