SP Congress Seat Sharing : లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్తో సీట్ల పంపిణీ ఖరారయ్యే వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పాల్గొనరని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో 80స్థానాల్లో కాంగ్రెస్కు 15 సీట్లు మాత్రమే ఇస్తామని సమాజ్వాదీ పార్టీ చెప్పింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ అంగీకరిస్తేనే ఎన్నికల్లో సహాయ సహకారాలు అందిస్తామని తేల్చిచెప్పింది.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిగా ఏర్పడిన విపక్షాలు సీట్ల పంపకాల విషయంలో ఏకతాటిపైకి రాలేకపోతున్నాయి. ఇప్పటికే బంగాల్ , పంజాబ్లలో అధికార తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిపోరుకే సిద్ధమయ్యాయి. సమాజ్వాదీ పార్టీ చేసిన ప్రతిపాదనను అంగీకరిస్తే రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో అఖిలేశ్ యాదవ్ పాల్గొంటారని సమాజ్వాదీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని అంటున్నాయి. కాగా, ఉత్తర్ప్రదేశ్లో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలిచింది.
ఒంటరిగానే పోటీ
మరోవైపు, లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలను ఒంటరిగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోనుందని వదంతులు వ్యాపించడం వల్ల ఆమె వాటికి తెరదించారు. వదంతుల పట్ల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఎన్నికలకు ఒంటరిగా వెళతామని పలుమార్లు ప్రకటించినా పొత్తులపై రోజుకొక వదంతులను వ్యాప్తి చేస్తున్నారని మాయావతి మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు లేకుంటే లోక్సభ ఎన్నికల్లో కొన్ని పార్టీలు మెరుగైన ఫలితాలను సాధించలేవనడానికి ఇది రుజువని తెలిపారు. దోపిడీకి, నిర్లక్ష్యానికి గురవుతున్న పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రజా బలంతోనే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీతో పొత్తు పెట్టుకుంది.
చండీగఢ్ మేయర్ రాజీనామా- బీజేపీలోకి ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు
MSPపై కేంద్రం కీలక ప్రతిపాదన- ప్రభుత్వ ఏజెన్సీలతో ఐదేళ్ల ఒప్పందం! రెండు రోజుల్లో రైతుల నిర్ణయం!