Shahjahan Sheikh Arrest : బంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్ షాజహాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖాలోని ఓ ఇంటిలో ఉంటున్న షాజహాన్ను గురువారం ఉదయం అరెస్టు చేసి బసిర్హాట్ కోర్టుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. న్యాయస్థానం షాజహాన్కు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. రాష్ట్ర పోలీసులు 14 రోజులు కోరగా కోర్టు 10 రోజులు కస్టడీ విధించింది. షాజహాన్ను బంగాల్ పోలీసులు కోల్కతాలోని భబానీ భవన్కు తరలించారు. మరోవైపు షాజహాన్పై నమోదైన కేసులను బంగాల్ సీఐడీ దర్యాప్తు చేపట్టింది.
'లైంగిక వేధింపుల కేసులో కాదు'
అయితే షేక్ షాజహాన్ను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయలేదని దక్షిణ బంగాల్ ఏడీజీ సుప్రతిమ్ సర్కార్ అన్నారు. ఈడీ అధికారులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జనవరి 5న జరిగిన ఈ దాడి ఘటనలో షాజహాన్ ప్రధాన నిందితుడని తెలిపారు. 'ఈ కేసు సెక్షన్ 354కి సంబంధించినది కాదు. షాజహాన్పై చాలా కేసులు ఉన్నాయి. ఫిబ్రవరి 8, 9న నమోదైన కేసులన్నీ రెండు నుంచి మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించినవి. ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం జరిగిన వాటిని దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సమయం పడుతుంది' అని దక్షిణ బంగాల్ ఏడీజీ తెలిపారు.
షాజహాన్ షేక్ ఇంట్లో జనవరి 5న తనిఖీల కోసం వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందంపై ఒక గుంపు దాడి చేసినప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి దాదాపు 50 రోజులకు పైగా ఆయన పరారీలో ఉన్నారు. ఆయన అరెస్టును డిమాండ్ చేస్తూ సందేశ్ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈడీ, సీబీఐ సైతం ఆయన్ను అరెస్టు చేయొచ్చని కలకత్తా హైకోర్టు బుధవారమే స్పష్టం చేసింది.
'ప్రజాస్వామ్యం అంటే ఇదే'
షేక్ షాజహాన్ అరెస్టుపై బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. 'ప్రజాస్వామ్యం అంటే ఇదే. దీని కోసమే ఇప్పటి వరకు ఎదురు చూశాం. అది ఇప్పుడు జరిగింది. ఇది అందరికీ గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుటి నుంచి బంగాల్లో చట్టబద్దమైన పరిపాలన ఉంటుందని అశిస్తున్నా' అని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు.
బీజేపీ నిరసనల కారణంగానే అరెస్ట్
షేక్ షాజహాన్ అరెస్ట్ ఓ స్క్రిప్ట్ అని ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య అభివర్ణించారు. 'టీఎంసీ, రాష్ట్ర పోలీసులు దోషులను రక్షించారు. అధికార పార్టీ రాసుకున్న స్క్రిప్ట్లో భాగంగా ఇప్పుడు అరెస్టు చేశారు' అని సమిక్ భట్టాచార్య విమర్శించారు. బీజేపీ నిరంతర ఆందోళన కారణంగానే టీఎంసీ ప్రభుత్వం షేక్ షాజహాన్ను అరెస్ట్ చేసిందని రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి అన్నారు. 'బీజేపీ, సందేశ్ఖాలీలోని మహిళల నిరసనల కారణంగానే మమతా బెనర్జీ ప్రభుత్వం షాజహాన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది' అని సువేందు తెలిపారు.
'రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం ఉంది'
మరోవైపు షేక్ షాజహాన్ను అరెస్ట్ చేసిన బంగాల్ పోలీసులను టీఎంసీ నేతలు ప్రశంసిస్తున్నారు. 'మొదట కోర్టు స్టే ఆర్డర్ కారణంగా షాజహాన్ను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కోర్టు స్పష్టం చేయటం వల్ల బంగాల్ పోలీసులు తమ పని పూర్తి చేశారు. రాష్ట్ర పోలీసుల సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అందుకే ఏడు రోజుల్లో షాజహాన్ను అరెస్ట్ చేస్తామని చెప్పాం. కానీ, స్టే ఆర్డర్ తొలగించిన రెండు మూడు రోజుల్లోనే షాజహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు' అని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ పేర్కొన్నారు.
భార్య ఆత్మహత్య కేసు- 30ఏళ్లకు భర్తను నిర్దోషిగా ప్రకటించిన సుప్రీం
2029లో జమిలి ఎన్నికలు! రాజ్యాంగంలో కొత్త చాప్టర్ చేర్చేందుకు లా కమిషన్ సిఫార్సులు!