National Voters Day 2024 : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అర్హులైన ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం జాతీయ ఓటర్ల దినోత్సవం ఏటా జరుపుతోంది. ఓటర్లందరూ పోలింగ్లో పాల్గొనేలా చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. మన దేశంలో 2011 నుంచి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నారు.
ఎలా ఆవిర్భవించింది?
జాతీయ ఓటర్ల దినోత్సవం అనే భావన 2011లో తెరపైకి వచ్చింది. ఎక్కువ మంది యువతను ఎన్నికల పోలింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆవిర్భవించింది. యువతలో ఓటరు నమోదు తగ్గుదలకు ప్రతిస్పందనగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనిని ప్రారంభించింది.
అప్పటి నుంచి భారత ఎన్నికల సంఘం జనవరి 1వ తేదీన 18 ఏళ్లు నిండిన అర్హులైన ఓటర్లందరినీ గుర్తించి, వారిని ఎన్రోల్ చేస్తూ వస్తోంది. వారికి ఏటా జనవరి 25న ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు (EPIC) అందజేస్తుంది. జనవరి 25న ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే 1950 జనవరి 25వ తేదీనే ఎన్నికల సంఘం ఏర్పాటైంది.
నేషనల్ ఓటర్స్ డే 2024 థీమ్
జాతీయ ఓటరు దినోత్సవం 2024 థీమ్- నేను కచ్చితంగా ఓటు వేస్తాను. "Nothing like voting, I vote for sure". ఈ థీమ్ ప్రతి వ్యక్తి తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తోంది. ఓటర్లు తమ ఓటు వేయడం ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషించాలని ఈ థీమ్ చెబుతోంది.
నేషనల్ ఓటర్స్ డే ప్రాముఖ్యత
ఓటుకు ఎంత పవర్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరుల ఓట్లు మాత్రమే స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఎవరు అధికారాన్ని చేపట్టాలో నిర్ణయిస్తాయి. తద్వారా దేశం విధానాలు, దిశను నిర్దేశిస్తాయి. కాలానుగుణంగా జనాభా అవసరాలు, ఆకాంక్షలు మారుతున్నందున, దేశ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దడంలో యువత ఓటింగ్ మరింత ముఖ్యంగా మారింది. అందుకే యువతరం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలి. అందుకు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం ఎంతో ముఖ్యం.
జాతీయ ఓటరు దినోత్సవం అనేది ఓటు ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి, ఎన్నికల్లో ఎక్కువ మంది వ్యక్తులను, ముఖ్యంగా కొత్తగా అర్హులైన ఓటర్లను పాల్గొనేలా ప్రోత్సహించడానికి జరుపుకునే రోజు. తమ నాయకులను ఎన్నుకోవడానికి, తమ దేశం ఎలా నడుస్తుందో చెప్పడానికి ఓటింగ్ ఒక ముఖ్యమైన మార్గం. ఇది ప్రజాస్వామ్య సమాజంలో స్వేచ్చ, స్వాతంత్ర్య భావనను సృష్టించడానికి కూడా సహాయపడుతుంది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి నిర్వహించడం ద్వారా, తప్పకుండా ఓటు వేయాలనే భావనను ప్రజలలో కలిగించడం చాలా వరకు సాధ్యమైందని చెప్పొచ్చు.
ఒక వ్యక్తి ఎలా ఓటు వేయవచ్చు?
18 ఏళ్లు నిండిన భారతీయులు ఎవరైనా ఎన్నికల సంఘంలో నమోదు చేసుకున్న తర్వాత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు. సాధారణ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చు. పోలింగ్ బూత్ల వద్ద ప్రజలు తమ ఓటర్ ఐడీ కార్డులను చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
2024 ఎన్నికలకు ముందు!
దేశంలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM), ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT)పై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది ఎన్నికల సంఘం. ఇప్పటికే 613 జిల్లాల్లోని 3,464 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అవగాహన కల్పించింది. ఓటింగ్ ప్రక్రియపై పౌరులకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే ఈ కార్యక్రమాల లక్ష్యం. సోషల్ మీడియాతోపాటు స్థానిక మీడియా ప్లాట్ఫారమ్స్లో ఎన్నికలకు మూడు నెలల ముందు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు ఎన్నికల అధికారులు.
ఓటర్ అవగాహనపై నినాదాలు
- ఓటు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం
- ఓటు వేయడం మీ హక్కు మాత్రమే కాదు, మీ బాధ్యత కూడా
- మీ ఓటు ద్వారా మీ వాయిస్ వినిపించండి
- ఏమీ మారదని భావించి మీరు ఇంతవరకు ఓటు వేయలేదా? ఇప్పుడు సమయం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
- నేను స్వేచ్ఛా దేశపు పౌరుడిని. ఓటు వేయడం నా హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఓటు వేయడం ద్వారా నేను విలువైన వ్యక్తిని ఎన్నుకోగలను
- మీకు ఏదైనా నచ్చకపోతే, మార్పు చేసే హక్కు మీకు ఉన్నప్పుడు దాని గురించి ఎందుకు మౌనంగా ఉండాలనుకుంటున్నారు? మీరు ఓటు వేయండి.