ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌- 10మంది మావోయిస్టులు హతం - Encounter In Chhattisgarh

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 12:20 PM IST

Updated : Apr 30, 2024, 6:33 PM IST

Chhattisgarh Encounter Today
Chhattisgarh Encounter Today

Chhattisgarh Encounter Today : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

Chhattisgarh Encounter Today : లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. కాంకేర్‌, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలతో సహా 10మంది నక్సల్స్‌ హతమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మకాం వేశారని నిఘావర్గాల ద్వారా సమాచారం అందటం వల్ల స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టాయి.

సోమవారం రాత్రి నుంచే!
సోమవారం రాత్రి నుంచే సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టగా మంగళవారం ఉదయం నక్సల్స్‌ ఉన్న అబూజ్​మాడ్​ ప్రాంతానికి చేరుకున్నాయి. వీరిని చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగురిని మట్టుబెట్టాయి. మరికొందరు నక్సల్స్‌ పరారయ్యారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు.

ఇప్పటివరకు 88 మంది నక్సలైట్లు!
ఘటనాస్థలం నుంచి ఏకే-47 రైఫిల్, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో కాంకేర్‌, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 88 మంది నక్సలైట్లు మరణించారు.

29 మంది మావోయిస్టులు హతం
ఇటీవల కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ కాల్పుల్లో 29 మంది మరణించారు. వీరిలో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు. కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలో ఏకే 47, మూడు ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం పదికిపైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌కౌంటర్ ఇలా మొదలైంది
ఈనెల 19న దేశంలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అలాంటి కీలక సమయంలో కాంకేర్ జిల్లాలోని ఛోటేబైథియా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గ్రామస్థుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఈ తరుణంలో మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా బలగాలు, పోలీసులతో కూడిన స్పెషల్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు అడవుల్లో తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వారిని ప్రతిఘటించేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు.

'లొంగిపోండి, పునరావాసం ఏర్పాటు చేస్తాం'
అబూజ్​మాడ్​ ఎన్‌కౌంటర్‌లో విజయం సాధించిన భద్రతా బలగాలను ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ అభినందించారు. నక్సలైట్లను లొంగిపోవాలని కోరిన విజయ్​ శర్మ, వారు హింస మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని విజ్ఞప్తి చేశారు. "ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరుకుంటోంది. ఏ నక్సలైట్ అయినా లేదా ఏదైనా సమూహం వీడియో కాల్ లేదా మధ్యవర్తి ద్వారా మాట్లాడాలనుకుంటే, దానికి మేము సిద్ధంగా ఉన్నాము. లొంగిపోయిన వారికి మెరుగైన పునరావాసం కల్పిస్తాము. వారు జనజీవన స్రవంతిలో చేరాలని, బస్తర్‌లో శాంతి, అభివృద్ధిని జరగాలని మేము కోరుకుంటున్నాము" అని విజయ్​ శర్మ చెప్పారు.

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​- 10 మంది మావోయిస్టులు హతం - Naxalites Killed In Encounter

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్- ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా ఆరుగురు హతం - Chhattisgarh Naxal Encounter

Last Updated :Apr 30, 2024, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.