దరఖాస్తు ఫీజు కంటే పెనాల్టీ ఎక్కువ - వైద్య విద్యార్థుల ఆగ్రహం
By ETV Bharat Andhra Pradesh Team
Published : 8 hours ago
PG Medical Seats Issue: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ అడ్మిషన్లలో పెనాల్టీలు విధించటంపై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. పీజీ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియటంతో రూ.20 వేల పెనాల్టీని ప్రతీ విద్యార్ధి నుంచి వసూలు చేయటంపై ఆక్షేపణలు వస్తున్నాయి. గడువు తర్వాత పెనాల్టీ వేయటంపై విద్యార్ధులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు ఫీజు కంటే పెనాల్టీ ఫీజు ఎక్కువ ఉండకూడదన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా పట్టించుకోవటం లేదని ఆక్షేపిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచాలని కోరుతున్నారు. జాతీయస్థాయిలో పీజీ అడ్మిషన్ల షెడ్యూల్ రాకున్నా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయ అధికారులు హడావిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్వీనర్ కోటా అడ్మిషన్లు హడావిడిగా ఎందుకు ముగించారో చెప్పాలన్న విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా రాష్ట్రంలో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ఖరారు చేయకుండానే, కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటించకుండానే దరఖాస్తు ప్రక్రియను నిలిపివేయటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.