Harish Rao On Mid Day Meals : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించటంలో తీవ్రంగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సరైన ఆహారం లేక ఇబ్బందులు పడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం కలుపుకుని కడుపు నింపుకోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విద్యార్థుల ఫొటో పంచుకున్న హరీశ్రావు, ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించటంలో ప్రభుత్వం విఫలం : హరీశ్ రావు
Published : Aug 4, 2024, 3:10 PM IST
Harish Rao On Mid Day Meals (ETV Bharat)
ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండటం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు.