వయనాడ్లో ఇంకా 130 మంది మిస్సింగ్!
Published : Aug 13, 2024, 7:24 AM IST
Wayanad Landslide Missing People : వయనాడ్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 130 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని వయనాడ్ జిల్లా యంత్రాంగం పేర్కొంది. వీరి కోసం చలియార్ నది, పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక, అటవీశాఖలకు చెందిన 190 మంది సభ్యుల బృందం వివిధ ప్రాంతాలను జల్లెడపడుతోంది. నీటిస్థాయిలు తగ్గడం వల్ల మృతదేహాలు బయటకు వస్తున్నాయని అధికారులు చెప్పారు. భారీవర్షం కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సోమవారం చేపట్టిన గాలింపులో పలు శరీర భాగాలు లభ్యమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే ఇప్పటి వరకు 229 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, వీరిలో 51 మందిని గుర్తించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.