ప్రెస్మీట్లో మాట్లాడుతుండగానే రక్తస్రావం- ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి కుమారస్వామి
Published : Jul 28, 2024, 9:23 PM IST
HD Kumaraswamy Hospitalized :కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా ఆయన ముక్కు నుంచి రక్తం కారింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు ఆయన్ను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ముక్కు నుంచి రక్తం కారడం, చొక్కాపై రక్తపు మరకలతో ఉన్న దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో చూసిన జేడీఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. విరామం లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల శరీరంలో వేడి పెరిగి రక్తస్రావం జరిగిందని జేడీఎస్ కార్యకర్తలు వివరించారు. వచ్చే వారం ప్రారంభంకానున్న బీజేపీ-జేడీఎస్ పాదయాత్రకు సంబంధించిన బెంగళూరులోని ఓ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను ఎత్తిచూపుతూ బెంగళూరు నుంచి మైసూర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఆగస్టు 3న ప్రారంభంకానున్న ఈ యాత్ర 10వరకు కొనసాగనుంది.