Published : Aug 19, 2024, 5:30 PM IST
హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట - అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశం
Karnataka HC On Muda Scam : ముడా స్కామ్ వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఆ వ్యవహారంలో ట్రయల్ కోర్టు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 29న ఈ అంశంపై విచారణ చేపడతామని, అప్పటివరకు మధ్యంతర ఉపశమనం అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. అంతకుముందు ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ అనుమతించడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ చందన్ గౌడార్ ఈ వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. కోర్టు విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన సీఎం, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని, భవిష్యత్లోనూ చేయనని చెప్పారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ దిల్లీ తరహాలో కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్ని గవర్నర్తో ఆదేశాలు ఇప్పించిందని ఆరోపించారు.