పట్టాలు తప్పిన ముంబయి-హావ్డా ఎక్స్ప్రెస్- 18 బోగీలు బోల్తా- ఇద్దరు మృతి, 20మందికి గాయాలు
Published : Jul 30, 2024, 7:40 AM IST
|Updated : Jul 30, 2024, 8:25 AM IST
Jharkhand Rail Accident :ఝార్ఖండ్లోని చక్రధర్పుర్ వద్ద ముంబయి-హావ్డా ఎక్స్ప్రెస్ రైలు 18 బోగీలు పట్టాలు తప్పాయి. మంగళవారం తెల్లవారుజామున జంషెడ్పుర్కు 80కి.మీ. దూరంలోని బారబాంబు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులందరికీ ప్రాథమిక వైద్యం చేసిన సిబ్బంది, ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసి, కొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఘటనాస్థలికి కొంతదూరంలోనే మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ రెండు ప్రమాదాలూ ఒకేసారి జరిగాయా అనే దానిపై స్పష్టత లేదని చెప్పారు.