4వేల మంది భక్తులతో అమర్నాథ్ యాత్ర- కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభం
Published : Jun 29, 2024, 10:21 AM IST
Amarnath Yatra 2024 : దక్షిణ హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. బాల్టాల్, నున్వాన్ బేస్ క్యాంపుల నుంచి తొలి యాత్రికుల బృందం 3,880 మీటర్ల ఎత్తులో కొలువైన మంచులింగాన్ని దర్శించుకునేందుకు బయల్దేరారు. శనివారం తెల్లవారుజామున 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గాం మార్గంతో పాటు 14 కిలోమీటర్ల బల్టాల్ మార్గాల నుంచి యాత్ర ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శుక్రవారం ఉదయమే జమ్ము భగవతినగర్లోని యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుంచి 4,603 మంది యాత్రికులతో కూడిన తొలి బృందానికి జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. వైమానిక నిఘాను ఉంచారు. 52 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది.