By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 9:08 PM IST
పులివెందులలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తాం: బీటెక్ రవి
YSRCP workers joined TDP: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం కత్తులూరు గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే టీడీపీలో చేరినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పార్టీ కండువా కప్పి వారిని టీడీపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బీటెక్ రవి మీడియాతో మట్లాడారు, జగన్ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. జగన్ తీరుతో, సొంత చెల్లెలు షర్మిల వేరే పార్టీలోకి వెళ్లారని చెప్పారు. మరొక చెల్లి సునీత తన తండ్రి హత్య కేసులో తనకు ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని తెలిసి, మరో రాష్ట్రానికి వెళ్లిందని బీటెక్ రవి పేర్కొన్నారు. ఏ ఎంపీ సీటు కోసం వివేకాను చంపారో, ఆ ఎంపీ టికెట్ కోసం సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తెలిసిందని పేర్కొన్నారు. వారితో సంప్రదింపులు చేస్తామన్నారు. సొంత మనుషులను చంపుకునే నీచులను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలు అనుకోవడం లేదన్నారు. పులివెందులలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తామని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు.