గిరిజన ప్రాంతాల్లో ఆగని డోలీ మోతలు- అనారోగ్యంతో ఉన్న మహిళను 6కి.మీ మోసుకెళ్లిన స్థానికులు - Tribals Carried Woman on a Doli
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 2:51 PM IST
Tribals Carried Woman for Six Kilometers on Doli: తరాలు మారినా గిరిజనులు తలరాతలు మాత్రం మారటం లేదు. సరైన రహదారులు లేకపోవటంతో అంబులెన్సులు కూడా రాలేని పరిస్థితి. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురైనా కాలినడకన కొండపై నుంచి నడవాల్సి వస్తోంది. గర్భిణీలు, పరిస్థితి విషమించిన వారిని అయితే డోలి మోతలు మోసుకుంటూ తీసుకురావాల్సిన దుస్థితి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం జాజులబండ గ్రామానికి చెందిన కావ్య అనే మహిళ అనారోగ్యానికి గురవ్వగా సరైన రహదారులు లేకపోవటంతో అంబులెన్స్ రాలేని పరిస్థితి. దీంతో చికిత్స కోసం 6 కిలోమీటర్ల డోలీపై మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లామని కావ్య కుటుంబ సభ్యులు వాపోయారు.
2021లో చందాలు వేసుకుని నిర్మించుకున్న రహదారి వర్షాలకు కొట్టుకుపోయిందని ఆవేదన చెందారు. గిరిజనులు శ్రమదానం చేసి వేసుకున్న రోడ్డుపై కొంతమంది గుత్తేదార్లు 28లక్షల రూపాయలకు బిల్లు వేసి ప్రభుత్వం వద్ద నుంచి దోచుకున్నారని ఆరోపించారు. విమానాల్లో ప్రయాణించే నేటి ఆధునిక యుగంలో కూడా పాలకుల నిర్లక్ష్యం వల్ల డోలీ మోతలు తప్పడం లేదని గిరిజనులు మండిపడుతున్నారు. ఇకనైనా కొండ గ్రామాల గిరిజనుల కోసం రహదారి ఏర్పాటు చేసి డోలీ మోతల నుంచి ఉపశమనం కలిగించాలని కోరారు.