LIVE : శ్రీవారి బ్రహ్మోత్సవాలు - అశ్వవాహనంపై ఊరేగుతున్న తిరుమలేశుడు
Published : 4 hours ago
|Updated : 2 hours ago
TIRUMALA BRAHMOTSAVAM 2024 LIVE : తిరుమల బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకొన్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోవింద నామ స్మరణతో తిరుమల కొండ పులకించిపోతోంది. బ్రహ్మోత్సవాల్లో గత ఏడు రోజులుగా వివిధ వాహనాలపై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు స్వామివారు అభయప్రదానం చేశారు. ఎనిమిదవ రోజైన నేడు ఉదయం మహారథంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి శ్రీవారు అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో స్వామి వారు దర్శనమిస్తున్నారు. అశ్వవాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి జరిగే అశ్వవాహన సేవలో కల్కి అవతారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతున్నారు. అశ్వవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగే కల్కి అవతారంలో స్వామిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతున్నాడు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : 2 hours ago