By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 4:41 PM IST
విదేశీ సంస్థలకు ప్రయోగశాలలుగా ప్రభుత్వ పాఠశాలలు- విద్యావిధానంపై నెలకో ప్రయోగం : విజయ్కుమార్
TDP Leader Vijay Kumar on IB Education: వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా విధానంలో నెలకో ప్రయోగం చేస్తూ రాష్ట్రంలోని పాఠశాలలను విదేశీ సంస్థలకు ప్రయోగశాలగా మార్చేసిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. ఐబీ (International Baccalaureate) విద్యా విధానం అనేది పేరుకు లాభాపేక్ష లేదని చెప్పుకున్నా, ఆ విద్యా విధానం అమలు చేసిన ప్రతి స్కూల్ నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుందని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఐబీ(ఇంటర్నేషనల్ బాకలారియెట్) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 వేల పాఠశాలల్లోనే అమలవుతోందని ఈ సంస్థకు ఒక్కసారిగా రాష్ట్రంలోని 5 వేల ప్రాథమిక పాఠశాలల్ని (primary Schools) డీల్ చేయగలిగే శక్తి ఉందా అని నీలాయపాలెం విజయ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ఉన్న మొత్తం 58,000 స్కూళ్ళకు దాదాపు 24,000 కోట్లు భారం పడుతుందన్నారు. ఎంత డిస్కౌంట్ లు ఇచ్చినా కూడా తక్కువలో తక్కువ వార్షిక ఫీజుల కింద కనీసం 2000 కోట్లు కట్టక తప్పని పరిస్థితని విమర్శించారు.