By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 4:52 PM IST
మైనారిటీల శ్రేయోభిలాషి చంద్రబాబు అయితే ద్రోహి జగన్ రెడ్డి: సయ్యద్ రఫీ - TDP Syed Rafi Fire on CM Jagan
TDP Leader Syed Rafi Fire on CM Jagan: జగన్ రెడ్డి పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయని, వారికి రక్షణ లేకుండా పోయిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. ముస్లింల ఆస్తులను వైఎస్సార్సీపీ నేతలు దోచుకుంటుంటే జగన్ రెడ్డి చూస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. పేద మస్లింల వివాహానికి వైఎస్సార్ పెళ్లి కానుక ఇస్తానని దగా చేశారని, ఉన్న దుల్హన్ పథకాన్ని రద్దు చేశాడని మండిపడ్డారు.
హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలను ఆదుకుంటానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి వంచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలకు ఇచ్చే తోఫాను రద్దు చేసి పేదల కడుపు కొట్టాడని ఆక్షేపించారు. ప్రమాదంలో మరణించిన వారికి వైఎస్సార్ బీమా 5లక్షల రూపాయలు ఇస్తానని దగా చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టో అంతా ఒక బూటకమని, మళ్లీ కూటమి మేనిఫెస్టోపై జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఏ రకంగా చూసినా చంద్రబాబు పాలనలోనే ముస్లింలకు న్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ నేతల అబద్ధాలకు మోసపోకుండా ముస్లిం సమాజం వచ్చే ఎన్నికల్లో జగన్, జే గ్యాంగ్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.