మహబూబాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగులు - 30 గ్రామాల రాకపోకలకు అంతరాయం - Ponds Overflow in Mahabubabad
Published : Jul 30, 2024, 12:56 PM IST
Pond Overflow in Mahabubabad District : రాష్ట్రంలో కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని చెరువుల్లో నిండుకుండల్లా మారాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి అలుగులు పారుతున్నాయి. జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాలలో వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై ఉన్న వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో 30 గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
చెరువులను తలపిస్తున్న పంట పొలాలు : కొత్తగూడ సమీప గ్రామాలు కొత్తపల్లి వాగు, మొండ్రాయి గూడెం వాగు, వేలుబెల్లి వాగు, కతర్ల వాగు, పోలీస్ స్టేషన్ సమీపంలోని బుర్కపల్లి వాగు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. నాట్లు వేసిన పొలాలలోకి వరద నీరు చేరడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. బుర్కపల్లి వాగు పొంగుతుండడంతో మూడు గేదెలు కొట్టుకపోయాయి. గంగారం మండలంలోని కాటినాగారం కోమట్లగూడెం మధ్యలో భారీగా వరద ప్రవహిస్తుండడంతో అటువైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.