సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు వాడుకుని ఎస్సీ, ఎస్టీలను ముంచారు: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 6:00 PM IST
MRPS State President Namapogu Venkateswara Rao on SC Coorporation: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు వాడుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీల సంక్షేమాన్ని ముంచేసారని ఏపీ ఎమ్మార్పీఎస్ (MRPS) రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సబ్ నిధులను ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఐదేళ్లు గడుస్తున్న ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ని పూర్తిగా రద్దు చేశారా అని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఒక్క సిమెంటు రోడ్డు అయినా వేశారా అని వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. కేవలం ఎస్సీలను మభ్యపెట్టడానికే నా ఎస్సీలు అని మాట్లాడుతున్న జగన్మోహన్రెడ్డి మూడు కార్పొరేషన్ల పేరిట డ్రామా ఆడారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ నిధులు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.