హైవేపై డ్రైవర్ అనుమానాస్పద మృతి- దారి దోపిడీ ముఠా పనేనా? - driver died on highway
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 12:16 PM IST
Man From Krishna District Suspicious Died at Nalgonda District : కృష్ణా జిల్లా పామర్రు మండలం చెట్ల వానిపురం గ్రామానికి చెందిన రాజవర్ధన్ నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజవర్ధన్ వృత్తి రీత్యా డ్రైవర్ కాగా ఈ నెల 18న మినీ డీసీఎంలో ఇంటి సామగ్రి లోడు తీసుకొని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారు. తిరిగి హైదరాబాద్ నుంచి వస్తుండగా మార్గ మధ్యలో ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో వాహనాల పార్కింగ్ స్థలంలో వాహనం నిలిపి ఉంది.
రాజవర్ధన్ మృతదేహం రోడ్డు పక్కన మట్టిపై పడి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనంలో ప్రయాణించిన గుర్తుతెలియని వ్యక్తులతో ఘర్షణ జరిగి హత్యకు దారితీసి ఉండొచ్చని లేదా పార్కింగ్ స్థలంలో వాహనం నిలుపుకొని నిద్రించే సమయంలో దారి దోపిడీ దొంగల చేతిలో హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు.