జగన్ వల్ల రాష్ట్రం చీకటిమయం - వెలుగులోకి తీసుకురావడానికి సమయం పడుతుంది : బీజేపీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
BJP Leader Bhanuprakash About YS Jagan And Tirumala Laddu Issue : వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఏపీని ఏ విధంగా సర్వనాశనం చేశారనే అంశాన్ని దేశం కేస్ స్టడీగా తీసుకోవచ్చని విమర్శించారు. నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై వాస్తవాలు బయట పెడతామని తెలిపారు.
ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైఎస్సార్సీపీ, నాయకులు, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అయితే ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలని గ్రహించకపోవడం హాస్యాస్పదమన్నారు. జగన్ తప్పిదాల వల్ల చీకటిమయమైన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే కొంత సమయం పడుతుందన్నారు. రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేయ్యాలి, జేబులు ఎలా నింపుకోవాలి అనేదానికి జగన్ రోల్ మోడల్గా నిలుస్తారని ఎద్దేవా చేశారు. తిరుమలలో దువ్వాడ జంట ఫోటో షూట్ ఘటన పై చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్ కోరారు.