జనసేన నుంచి మరో ఇద్దరికి పదవులు- సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ - Pawan Kalyan letter to Chandrababu
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 5:48 PM IST
Pawan Kalyan letter to Chandrababu : జనసేన పార్టీలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ తరఫున పవన్ సహా 21మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. కాగా శాసనసభలో కీలకమైన విప్ పవర్ తమ పార్టీలో ఇద్దరికి కేటాయించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు లేఖ రాశారు.
జనసేన నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు విప్ పదవులు కేటాయించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు లేఖ రాశారు. రైల్వే కోడూరు నుంచి గెలిచిన అరవ శ్రీధర్, నరసాపురం నుంచి గెలిచిన బొమ్మిడి నాయకర్ కు విప్ పదవులు ఇవ్వాలని లేఖలో కోరారు. వీరిలో నాయకర్ బీసీ వర్గానికి చెందిన వారు కాగా శ్రీధర్ ఎస్సీ వర్గానికి చెందిన వారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. కొత్తగా ఏర్పడిన శాసనసభలో విప్ పదవులు కూడా కీలకం. ఇందులో భాగంగా తమ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరికి విప్ పదవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉపముఖ్యమంత్రి పవన్ లేఖ రాసినట్లు జనసేన కార్యాలయం ప్రకటించింది.