ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అవినీతిని ప్రశ్నిస్తే బాపట్ల నుంచి వెళ్లనివ్వరా?: గాదె వెంకటేశ్వరరావు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 1:36 PM IST

Janasena Leader Gade Venkateswara Rao:  బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అక్రమాలపై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శీలంవారి పాలెంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలతో కలిసి పార్టీ పతాకాల ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అక్రమాలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కోన తట్టుకోలేక పోయారని అన్నారు. వైఎస్సార్ కుమార్తె కావటం వల్లే ఆమెను వెళ్లనిచ్చామని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాల నేతలు కోన అవినీతిని ప్రశ్నిస్తే బాపట్ల నుంచి వెళ్లనిచ్చేది లేదనటం ఆయన అహంకారానికి నిదర్శనని మండిపడ్డారు. 

ఉమ్మడి అభ్యర్థి ఘన విజయం సాధిస్తారు : రెండు సార్లు బాపట్ల ఎమ్మెల్యేగా కోన రఘుపతి గెలిచి ప్రకృతి సంపదను రఘుపతి దోచేస్తున్నారని, పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఇసుక మాఫియా నడుపుతూ కోట్లు సంపాదించారని గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఎమ్మెల్యే కబ్జాయత్నాలను అడ్డుకొని అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. కోన రఘుపతి అక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బాపట్లలో ఎమ్మెల్యే కోనాను టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఓడించి ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాపట్ల పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి నిజమైన ప్రగతి అంటే ఎలా ఉంటుందో ప్రజలకు చూపిస్తామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details