By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 23, 2024, 7:50 PM IST
నది మార్గం ద్వారా రాష్ట్రంలోకి మద్యం సరఫరా - చాకచాక్యంగా పట్టుకున్న పోలీసులు - Illegal Liquor
Illegal Liquor Transportation in State Boundaries : ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం ఎరులై ప్రవాహిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల సిబ్బంది కళ్లు గప్పి మరి రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. తాజాగా కృష్ణా నదీ మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్ర మద్యం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న జగ్గయ్యపేట ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది రంగంలోకి దిగారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వారిని చాకచాక్యంగా పట్టుకున్నారు. పట్టుబడి మద్యం ముఠా నది మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు సీఐ మణికంఠ రెడ్డి తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని చింతలపాలెం మండలం దొండపాడు గ్రామం నుంచి రాష్ట్రంలోకి బాణావతు కోటేశ్వరరావు, అతని కుమారుడు మణికంఠ మద్యం సరఫరా చేస్తున్నట్లు సీఐ మణికంఠ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారి నుంచి మూడు ద్వి చక్ర వాహనాలు, 407 మద్యం సీసాలు పట్టుబడినట్లు తెలియజేశారు. ఈ ముఠాలో మరొక వ్యక్తి అయిన మాడ శివ పరారిలో ఉన్నట్లు, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.