ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 11:47 AM IST

ETV Bharat / videos

నందిగం సురేష్‌ అక్రమ భవన నిర్మాణం- హైకోర్టులో విచారణ వాయిదా - HC On Nandigam Suresh Building

HC On Nandigam Suresh Illegal Building: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 1.07 ఎకరాల్లో అనుమతి లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చివేస్తామంటూ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. కార్యదర్శి ఇచ్చిన నోటీసుపై అదనపు వివరాలు సమర్పించేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది. పిటిషనర్‌ వాదనలు వినాలని, ఆ తర్వాత చట్ట నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఇకపై ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు చేపట్టవద్దని పిటిషనర్‌కు తేల్చిచెప్పింది.  

భవన నిర్మాణ అనుమతి రెన్యువల్‌ విషయంలో దరఖాస్తు చేసుకునేందుకు పిటిషనర్‌కు అవకాశం కల్పించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఈమేరకు ఉత్తర్వులిచ్చారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, భవన నిర్మాణానికి అనుమతిస్తూ 2014లో పంచాయతీ తీర్మానం చేసిందన్నారు. రాజకీయ కారణాలతో నిర్మాణ అనుమతులు పొందలేకపోయారన్నారు. ప్రభుత్వ న్యాయవాది దిలీప్‌ వాదనలు వినిపించారు. ఆ స్థలం తనదేనని నిరూపించుకునేందుకు పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచలేదన్నారు. తాము ఇచ్చిన నోటీసుకు పిటిషనర్‌ వివరణ ఇచ్చారని, వాటిని పరిశీలించి తుది ఉత్తర్వులిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details