ధనలక్ష్మీ అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Published : 4 hours ago
Vasavi Kanyaka Parameshwari Goddess: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గాదేవి అమ్మవారు ఈ రోజు (అక్టోబర్ 10) ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య యువజన సంఘం, వాసవి మహిళా సంఘాల ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనమివ్వడానికి రూ.59,99,600 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమ పూజలు చేశారు. వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ఆవరణలో వైభవంగా చండీయాగం నిర్వహించారు. పట్టణంలోని ప్రజలంతా తరలి వచ్చి ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. నగదు నోట్లతో ఏర్పాటు చేసిన దండలు వివిధ ఆకృతులు చూపరులను ఆకట్టుకున్నాయి. నవరాత్రులలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.