ఎగువన భారీ వర్షాలు - భద్రాచలం వద్ద గోదావరికి జలకళ - Godavari Water Level Increases - GODAVARI WATER LEVEL INCREASES
Published : Jul 5, 2024, 2:11 PM IST
Godavari Water Level Increases : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. మూడు రోజుల క్రితం 4 నుంచి 5 అడుగుల మేర ప్రవహించిన గోదావరి నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 10 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా నీటిమట్టం తక్కువగా ఉండి ప్రవహించిన గోదావరి, ఎగువన కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది.
గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వర్షపునీరు రావడంతో అన్ని గేట్లను ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 10 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 12 అడుగుల వరకు చేరవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎడారిని తలపించిన గోదావరి, ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల జలకళను సంతరించుకుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతం వరద నీటితో కళకళలాడుతోంది.