By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 12:53 PM IST
ఊడిన స్కూలు స్లాబ్ పైపెచ్చులు - విద్యార్థులకు తప్పిన ప్రమాదం
Dilapidated Government School Building : నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాళెం పంచాయతీ అనుబంధ గ్రామం పల్లిపాళెం ప్రాథమిక పాఠశాల భవనం పైకప్పు సోమవారం పెచ్చులూడిప డింది. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. 30 మంది విద్యార్థులు ఉండే ఇద్దరు ఉపాధ్యాయులు పని చేసే ఈ పాఠశాలకు ఒక గది, దాని వరండా మాత్రమే ఉంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికి గది పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దాంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర వారిని సముదాయించారు.
విద్యార్థుల కేకలతో ఏమైందో అన్న ఆందోళనతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు పరుగులు తీశారు. ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన అనంతరం గత్యంతరం లేక వరండాలో కూర్చోబెట్టి తరగతులు నిర్వహించారు. ఈ సంఘటనపైనా, తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే తమ పిల్లలను పాఠశాలకు పంపించకుండా ఇంటి వద్దనే ఉంచుతామని తెలియజేశారు. అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న పాఠశాలను తొలగించి నూతన పాఠశాలను నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
పాఠశాల కమిషనర్ ఆదేశాలతో ప్రస్తుత భవనం స్థానంలో కొత్తది నిర్మించేందుకు గత ఏడాది నవంబరులోనే ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించాం ఎంఈవో జానకిరాం తెలిపాుర. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అప్పటి వరకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించామని తెలిపారు.