ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటం: సీపీఐ కార్యదర్శి - CPI State Secretary Rama krishna
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 7:40 PM IST
CPI State Secretary Rama krishna On Special Status: ఏపీకి ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో ఏపీ ప్రజల హక్కుల కోసం ఆత్మ గౌరవం పేరుతో విజయవాడ లెనిన్ కూడలిలో దీక్ష చేపట్టారు. దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్ పలువురు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అవుతున్నా ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది లేదని, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేయాలన్నారు.హోదా తెస్తానన్న జగన్ మోడీ కాళ్ల మీద పడ్డారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వారినే ఎన్నికల్లో ఆదరించాలని రామకృష్ణ తెలిపారు. హోదా గురించి మాట్లాడితే తనపై ఐటీ దాడులు చేయించారని ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.