బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్! - కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు? - Congress Leaders Hold Meeting - CONGRESS LEADERS HOLD MEETING
Published : Apr 2, 2024, 2:34 PM IST
Congress Leaders Hold Meeting In Yellandu : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తమ కార్యక్రమాల్లో వేగం పెంచింది. తాజాగా ఇల్లందులో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొనడంతో జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగలనుందా అనే చర్చ మొదలైంది.
మహబూబాబాద్ పరిధిలో కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ ఆఫీస్లో ఈ సమావేశం జరిగింది. పార్టీ నాయకులతో జరిగిన సమావేశానికి మీడియాను అనుమతించలేదు. ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. వారితో పాటు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా ఉన్న వెంకట్రావు, కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న సంకేతాలు ఈ సమావేశంతో బలపడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటిలోకి చేరతారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
సమావేశం అనంతరం ప్రజాప్రతినిధులతో తుమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను విస్మరించి, వంద రోజుల కాంగ్రెస్ పాలనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన మాజీ సీఎం కేసీఆర్, అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు. వానాకాలం నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం, వేసవిలో నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తోందని విమర్శించారు.