By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 7:04 PM IST
త్వరలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభిస్తాం : రామ్మోహన్ నాయుడు - RAM MOHAN NAIDU IN CBN OATH
Civil Aviation Minister Ram Mohan Naidu: మంత్రి వర్గంలో స్థానం దక్కిన వారిని చూస్తే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి న్యాయం జరిగిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎన్నో కేసులను నేతలు ఎదుర్కొని పని చేశారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్టు, తిరుపతి విమానశ్రాయం వంటివి రాష్ట్రంలో అంతర్జాతీయ విమానశ్రయాలుగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్పోర్టుని పక్కా ప్రణాళికతో అతి త్వరలో ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడలో ఉన్న అదనపు టర్నినల్ భవనాన్ని గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది లేదని ఆయన మండిపడ్డారు. సుదీర్ఘమైన రాష్ట్రంలో విమానయ కనెక్టివిటీని పెంచాలన్నారు. వీటన్నింటిపై దృష్టి సారించేందుకు సీఎం చంద్రబాబు సూచనలు తీసుకొని విమానయాన శాఖలో అద్భుతాలు సృష్టించడానికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు.