By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 10:37 PM IST
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం - CARGO SERVICE IN Vijayawada AIRPORT
Cargo Services Started at Vijayawada International Airport: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభమయ్యాయి. కార్గో సర్వీసుకు 2021లో ముందడుగు పడినప్పటికి కరోనా కారణంగా నిలిచిపోయాయి. తాజాగా కార్గో సేవల పునరుద్ధరణకు పిలిచిన టెండర్ను ఒమేగా ఎంటర్ప్రైజెస్ సంస్థ దక్కించుకుంది. రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతోపాటు పూలు, పండ్లు, మిర్చి, తదితర ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా సరసమైన ధరలలో గంటల వ్యవధిలో చేర్చేందుకు కార్గో సర్వీసు దోహదపడుతుందని విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి అన్నారు. ఈ కార్గో సర్వీసులు ప్రారంభించడం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. కార్గో సర్వీసు ఛార్జీలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగానే ఉంటాయని లక్ష్మీకాంత రెడ్డి తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ భవనం ఏడాదిలోగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ సర్వీసును నడపడానికి కస్టమ్స్ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల విజయవాడ నుంచి ముంబయికు ప్రారంభించిన విమాన సర్వీసులకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.