Published : 6 hours ago
ఎస్సారెస్పీ డీ83 కాల్వపై కుప్పకూలిన వంతెన - వ్యవసాయ పనులకు ఆటంకం - Collapsed Bridge in Peddapalli
Bridge Collapsed in Peddapalli : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలోని ఎస్సారెస్పీ డీ83 కాల్వపై ఉన్న వంతెన కుప్పకూలింది. ప్రస్తుతం ఈ కాలువ ద్వారా పంటలకు సాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో నీటి ప్రవాహానికి వంతెన కుప్పకూలినట్లు రైతులు తెలిపారు. కాలువలు, వంతెనల నిర్వహణను ఎస్సారెస్పీ అధికారులు గాలికి వదిలేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. వంతెన కూలిపోవడంతో గత నాలుగు రోజుల నుంచి వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాల్వకు ఇరువైపులా వందలాది ఎకరాలు పంటలు సాగు చేస్తున్నామని వంతెన కూలిపోవడంతో ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే 4 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుందని రైతులు వాపోయారు. వంతెన కూలిపోవడంతో ఇటీవల ఎస్సారెస్పీ అధికారులు వచ్చి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వెళ్లిపోయారు తప్ప మళ్లీ ఇటువైపు చూడలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మించి, వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వేడుకున్నారు.