Published : Apr 19, 2024, 6:16 AM IST
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు : ఎంపీ లక్ష్మణ్ - MP laxman on India Alliance
BJP MP laxman on India Alliance : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని, ఆ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీలే చెబుతున్నాయని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల అని ఆయన పేర్కొన్నారు. మహబూబ్నగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేసిన సందర్భంగా నిర్వహంచిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ కూటమిలో మోదీకి సరితూగే నాయకుడు ఎవరున్నారో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బెంగాల్, పంజాబ్లో అక్కడి మిత్రపక్షాలు కాంగ్రెస్ను వద్దనుకుంటున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలు వారి కుటుంబం కోసం పనిచేస్తుంటే మోదీ ఒక్కడే దేశం కోసం పనిచేస్తారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లాంటి పార్టీలు ఎన్నికలకు రాగానే కులం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తాయని విమర్శించారు. వారి నినాదం విభజిత భారత్ అయితే, మోదీ నినాదం వికసిత భారత్ అన్నారు.